తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించేందుకు క్రీడాశాఖ సిద్ధమైంది. ఈ నెల 25, 26, 27 తేదీలలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ స్పెషల్ సెషన్స్ నిర్వహించనున్నారు.
ఈ పోటీలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి మూడు గంటల పాటు వివిధ క్రీడా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రజాప్రతినిధుల ఆరోగ్యం, శారీరక దృఢత్వం, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రీడా పోటీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొనే అవకాశముందని సమాచారం. అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపై క్రీడల ద్వారా కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.




