సోషల్ మీడియాలో రీల్స్ కోసం యువత ఎంతకైనా తెగబడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదనే కారణంతో ఒక యువతి తన తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ కార్యాలయానికి తీసుకువచ్చింది.
కొరియర్ కార్యాలయ సిబ్బంది బస్తాలో ఏదో కదలిక గమనించి అనుమానంతో మూటను విప్పి చూడగా, అందులో ఒక వ్యక్తి ఉన్నట్టు తెలిసి ఆశ్చర్యపోయారు. వెంటనే కుటుంబ సభ్యులను ప్రశ్నించగా, “టికెట్లు దొరకలేదు కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. ఇతడిని పార్సిల్ చేయాలనుకున్నాం” అని సమాధానం ఇచ్చారు.
ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. విచారణలో ఇది నిజంగా రీల్ కోసం చేసిన ప్రయత్నమని తెలిసి పోలీసులు షాక్కు గురయ్యారు. ఇలాంటి ప్రమాదకరమైన చర్యలు ప్రాణాపాయానికి దారితీస్తాయని హెచ్చరిస్తూ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు.
సోషల్ మీడియా ప్రాచుర్యం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని పోలీసులు ప్రజలకు సూచించారు.




