మధిర మండల పరిధిలోని రాయపట్నం గ్రామంలో రైతులు కల్లాలలో ఆరబోసిన ఎండుమిరపకాయలు గత రాత్రి దొంగతనానికి గురయ్యాయి. ఒకేసారి వేర్వేరు పొలాల ప్రాంతాల్లో దొంగతనాలు జరగడంతో రైతులు అవాక్కయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే వేళ ఇలా నష్టం జరగడంతో బాధిత రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
గ్రామానికి చెందిన ఆగొల్ల వెంకటరావుకు చెందిన 15 క్వింటాళ్లు, నాగనబోయిన వెంకటేశ్వర్లుకు చెందిన 10 క్వింటాళ్లు, భవంతి శ్రీనుకు చెందిన 5 క్వింటాళ్ల ఎండుమిరపకాయలు కల్లాలలో ఆరబోసి ఉంచగా దొంగతనానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో రాయపట్నం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ఆందోళనకు గురయ్యారు.
బాధిత రైతులు దొంగతనానికి గురైన పంటను గుర్తించి తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వ పరంగా తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.




