హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ ఘటన కలకలం రేపింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆమె వద్ద ఉన్న సుమారు పది తులాల బంగారాన్ని అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన సుధరాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డిశ్చార్జ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో, డాక్టర్ మాదిరిగా యాప్రాన్ ధరించిన ఓ మహిళ రోగి గదిలోకి ప్రవేశించింది.
ఆమె కుటుంబ సభ్యులను బయటకు వెళ్లమని చెప్పడంతో వారు గది బయటకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత లోపలికి వెళ్లి చూడగా, సుధరాణి స్పృహ కోల్పోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా, గదిలోకి వచ్చిన వ్యక్తి తమ సిబ్బందిలో ఎవరో తెలియదని యాజమాన్యం తెలిపింది.
దీంతో షాక్కు గురైన కుటుంబ సభ్యులు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు, యాప్రాన్ ధరించిన మహిళ నర్సింగ్ స్టాఫ్ గదిలోకి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ఆమె ఆసుపత్రి సిబ్బంది తెలిసిన వ్యక్తేనా లేక బాహ్య వ్యక్తేనా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై ఆసుపత్రి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.





